అస్సాంలో కూలిన ఐఏఎఫ్ ఏఎన్-32 విమానం.. ఐదుగురి మృతి
ABN , Publish Date - Jun 13 , 2026 | 11:32 AM
అస్సాంలో ఓ రవాణా విమానం కూలిపోయింది. ఐఏఎఫ్కు చెందిన ఏఎన్-32 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయిందని, ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: అస్సాంలోని జోర్హాట్ రౌరియా విమానాశ్రయంలో భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ సహా ఐదుగురు మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఎగువ అస్సాంలోని వ్యూహాత్మకంగా ముఖ్యమైన వైమానిక స్థావరం సమీపంలో ఈ ప్రమాదంలో జరిగినట్టు అధికారులు భావించారు. విమానాన్ని ల్యాండ్ చేసేందుకు యత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం అనంతరం విమానంలో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనాస్థలం నుంచి దట్టమైన పొగలు ఎగసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న రక్షణ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
ఏఎన్-32 గురించి..
ఇది 1980లలో అభివృద్ధి చేసిన సోవియట్ కాలంనాటి డబుల్ ఇంజిన్ టర్బోప్రాప్ రవాణా విమానం. ప్రస్తుతం భారత వైమానిక దళంలో సుమారు 105 ఏఎన్-32 విమానాలు సేవలందిస్తున్నాయి. వీటిలో 35 విమానాలను ఉక్రెయిన్కు చెందిన సంస్థ ద్వారా ఆధునికీకరించగా, మిగిలిన వాటిని దేశీయంగా అప్గ్రేడ్ చేస్తున్నారు. అయితే.. ఈ విమానాలు పాతబడుతుండటంతో వీటి స్థానంలో కొత్తవాటిని సమకూర్చుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భారత వైమానిక దళం(IAF) కోసం అలాంటి విమానాలను సుమారు 60 వరకు కొనుగోలు చేసే అవకాశముంది. దీనికి రక్షణ సేకరణ మండలి(DAC), భద్రతా కేబినెట్ కమిటీ(CCS)ల ఆమోదం పొందాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి:
వరుస విజయాలతో దేశ రక్షణ రంగంలో డీఆర్డీఓ సరికొత్త చరిత్ర
భారత్లో స్టార్లింక్ సేవలకు తాత్కాలిక బ్రేక్.. భద్రతా అనుమతులపై కేంద్రం సమీక్ష